రైతుల ఆదాయం మరింతగా పెరిగింది.. ఎనిమిదేళ్ల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి: మోదీ

  • వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నామన్న ప్రధాని 
  • పెట్రోల్ లో ఇథనాల్ కలపాలన్న నిర్ణయంతో రైతులకు ఆదాయం పెరిగిందని వెల్లడి 
  • ప్లాస్టిక్ తో జరిగే హాని కారణంగానే నిషేధించినట్టు ప్రకటన
దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా చేపట్టిన చర్యలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ఇందుకు తోడ్పడుతోందని చెప్పారు. గుజరాత్ లోని సబర్ డెయిరీ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని మోదీ అన్నారు. వ్యవసాయంతోపాటు పశువులు, చేపల పెంపకం, తేనె వంటి ఇతర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం మరింతగా పెరిగిందని చెప్పారు. తాము చేపట్టిన చర్యల ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయన్నారు.

ఇథనాల్ వినియోగంతో లాభం
పెట్రోల్‌ లో ఇథనాల్‌ కలపడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. అటు కర్బన ఉద్గారాలు తగ్గించడం, ఇటు దిగుమతులపై ఆధారపడడాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే ప్రక్రియను చేపట్టామని.. దీనిని మరింత పెంచుతామని తెలిపారు. ఎనిమిదేళ్ల కిందట పెట్రోల్‌లో 40 కోట్ల లీటర్ల ఇథనాల్‌ కలపగా.. ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు పెరిగిందని వివరించారు. ప్లాస్టిక్ తో ఉన్న హాని కారణంగా దానిపై నిషేధం విధించామని మోదీ పేర్కొన్నారు.


Narendra Modi
BJP
National
Farmers
Ethenol
Petrol
Farmers Income

More Telugu News